: పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సాకులు చెబితే సరిపోతుందా?: తమ్మారెడ్డి భరద్వాజ

రాజకీయాల్లోకి రావడమంటేనే ప్రజల్లోకి రావడమని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ప్రజల్లోకి రావడమంటే సమస్యలపై పోరాటానికి ముందడుగు వేయడమని అన్నారు. ఎవరో చెబితే విన్నానని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడడం సబబు కాదని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ చెబుతున్న సెక్యూరిటీ కారణాలు ఇంతవరకు ఎప్పుడూ ఎదురు కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఒకసారి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్తుండడం వల్లే ఎక్కువ మంది ఆయనను చూసేందుకు వస్తున్నారని, అదే పవన్ కల్యాణ్ మీ ఊరు వస్తారని తెలిస్తే ఎవరైనా ఇంకో ప్రాంతంలో ఆయనను చూసేందుకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ కు మద్దతు తెలపాలని ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు, వారిలోకి వెళ్లకుండా, ఎవరో చెప్పగానే సమస్య తెలిసిపోయిందని అనుకోవడం రాజకీయ నాయకుడి అపరిపక్వతను సూచిస్తుందని అన్నారు. అయితే భద్రతా ఇబ్బందులు ఎప్పుడైనా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమమని ఆయన చెప్పారు. తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అలా కాకుండా ఆఫీసులో కూర్చుని, అనుచరులు చెప్పారని గుడ్డిగా ముందుకు వెళ్లడం సరికాదని ఆయన తెలిపారు. రాజకీయ నాయకుడు సమస్య మూలాల నుంచి తెలుసుకుంటే పరిష్కారాలు వెతకగలడని ఆయన అభిప్రాయపడ్డారు. 

More Telugu News