: జగన్ లోకి ఎన్టీఆర్ ప్రవేశించి ఆ మాటలు చెప్పి ఉంటారు: లక్ష్మీపార్వతి సమర్థన

నిన్న నంద్యాలలో జరిగిన సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు గుప్పించడం తెలిసిందే.  ముఖ్యంగా, మామ ఎన్టీఆర్ ను చంపిన చరిత్ర చంద్రబాబుదని జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు, నాయకులు తీవ్రంగా ఖండించడమే కాకుండా, జగన్ పై వారు విరుచుకుపడటం విదితమే. అయితే, జగన్ చేసిన వ్యాఖ్యలు సబబేనంటూ వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సమర్థిస్తున్నారు.

ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని, తండ్రి లాంటి మామను చంపిన చరిత్ర చంద్రబాబుదని, జగన్ లోకి ఎన్టీఆర్ ప్రవేశించి ఆ మాట చెప్పించి ఉంటారని అన్నారు. హత్యారాజకీయాలపై టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో నంద్యాల ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆ విషయాన్నే జగన్ నిన్న ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలే జగన్ ను కదిలించాయని, చంద్రబాబును ఏం చేసినా తప్పులేదంటూ లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News