: ఉగ్ర సంస్థ జమాత్ ఉద్ దవా ఇక రాజకీయ పార్టీ... స్వాతంత్ర్య దినోత్సవం నాడు రిజిస్ట్రేషన్ చేయనున్న హఫీజ్ సయీద్!

ఉగ్రవాదులను తయారు చేస్తూ వారిని ఇండియాపైకి పురిగొల్పుతున్న జమాత్ ఉద్ దవా అధినేత, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, తన సంస్థను రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించనున్నాడు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లాహోర్ లో జరిగే బహిరంగ సభలో తన రాజకీయ ప్రవేశంపై ఆయన ప్రకటిస్తాడని, అదే రోజు ఎలక్షన్ కమిషన్ వద్ద జేయూడీ పేరును మిల్లీ ముస్లిం లీగ్ గా మార్చి రిజిస్టర్ చేయిస్తాడని తెలుస్తోంది.

పాకిస్థాన్ సైన్యంతో పాటు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో మంచి సంబంధాలున్న హఫీజ్, వాటిని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం హఫీజ్ హౌస్ అరెస్టులో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. 2008లో కసబ్ సహా పలువురిని ముంబైకి పంపి మారణహోమం చేయించిన హఫీజ్ తలపై రూ. 66 కోట్ల బహుమతి ఉంది. భారత్, అమెరికా దేశాలు హఫీద్ ను వాంటెడ్ టెర్రరిస్టుగా గుర్తించాయి. జేయూడీని అమెరికా కూడా ఉగ్రసంస్థగా గుర్తించిన నేపథ్యంలోనే ఆ పేరును మార్చాలని హఫీజ్ సయీద్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News