: ఎయిరిండియా బాటలో జెట్ ఎయిర్‌వేస్.. మెనూ నుంచి బోలెడన్ని పదార్థాలు మాయం!

ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు ప్రభుత్వ రంగ  సంస్థ ఎయిరిండియా బాటలో నడవాలని నిర్ణయించింది. దేశీయ రూట్లలో మెనూలో కోత విధించాలని నిర్ణయించింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా అందులోంచి బయటపడేందుకు మెనూలో కోత విధించి అనుకున్న ఫలితాలు సాధిస్తోంది. దీంతో జెట్ ఎయిర్‌వేస్ కూడా ఎయిరిండియా బాటలోనే నడవాలని నిర్ణయించుకుని కోతకు సిద్ధమైంది.

బిజినెస్, ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు అందిస్తున్న మెనూను గణనీయంగా తగ్గించాలని జెట్ ఎయిర్‌వేస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయాణికులకు అందించే ప్లేట్‌లో ఉండే 23 పదార్థాలను ఏడుకు తగ్గిస్తూ జాబితా కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే నాలుగు రూట్లలో అందించే ఆహార పదార్థాల జాబితాను సిద్ధం చేసినట్టు జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
 
కాగా, గత నెల నుంచి ఎయిరిండియా తమ విమానాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు అందించే మెనూ నుంచి మాంసాహారాన్ని తొలగించింది. అయితే జెట్ ఎయిర్‌వేస్ మాత్రం అలా చేయకుండా 15 ప్రత్యేక మెనూలు సిద్ధం చేసింది. అందులో చిల్డ్రన్, వేగాన్, జైన్, గ్లుటెన్-ఫ్రీ, లో-కేలరీ, లాక్టో-వోవో, రా, ఓరియంటల్, కోషెర్ తదితర మెనూలను సిద్ధం చేసింది. ప్రయాణికులు వీటినుంచి ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

More Telugu News