: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాలను జిల్లా చేయాలి: శిల్పా మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న నంద్యాలను జిల్లాగా చేయాలని శిల్పా మోహన్ రెడ్డి కోరారు. నంద్యాలలో జరుగుతున్న వైసీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నంద్యాలలో సాక్షి టీవీ చానెల్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. తమకు అనుకూలంగా లేని టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసే సంస్కృతి అధికార పక్షానిదని ఆయన గుర్తుచేశారు. అనాథలమని ఓట్లు అడుక్కుంటున్న అఖిలప్రియ ఎలా అనాథ అయ్యిందో గుర్తుతెచ్చుకోమని, తమ తండ్రి ఎంత మంది పిల్లలను అనాథలుగా మార్చాడో తెలుసుకుని ఓట్లు అడగండని సలహా ఇచ్చాడు.
తాను టీడీపీలో ఉన్నపుడు అభివృద్ధి చేయమని అడిగితే డబ్బులు లేవని అన్నారని, ఇప్పుడు ఎన్నికలు అనే సరికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అలాగే తానెప్పుడూ ముస్లింలను అగౌరవ పరచలేదని, వారి అభివృద్ధికి పాటుపడ్డానని, ఒకవేళ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని శిల్పా మోహన్ రెడ్డి సభాముఖంగా కోరారు. ఇంకా కులాలు, మతాలను రాజకీయాలకు వాడుకోవద్దని తెలుగుదేశం వారికి ఆయన మనవి చేశారు. తాను, తన తమ్ముడు, తమ కుటుంబాలు జగన్ కుటుంబానికి, నంద్యాల ప్రజల బాగుకోసం అండగా నిలబడతామని శిల్పా మోహన్ రెడ్డి తెలియజేశారు.