: సింధు నదీజలాల ఒప్పందంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: ప్రపంచ బ్యాంకు
భారత్ - పాకిస్థాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న సింధు నదీజలాల ఒప్పంద అంశం ఇంకా కొలిక్కి రాలేదని, దీని గురించి మీడియాలో వస్తున్న కథనాలు అసత్యమని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు సమక్షంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. కిషన్ గంగ, రాట్లే నదులపై జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భారత్కు అనుకూలంగా వరల్డ్ బ్యాంక్ తీర్పు చెప్పిందని, ఇందుకు పాకిస్థాన్ అంగీకరించిందని కథనాలు రాశారు. చర్చలు పూర్తైన 24 గంటల తర్వాత ప్రపంచ బ్యాంకు ఈ కథనాలపై స్పందించింది. వివాదానికి సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, మళ్లీ సెప్టెంబర్లో ఇరుదేశాల మధ్య మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టతనిచ్చింది. ఇప్పుడు జరిగిన సమావేశానికి సంబంధించిన విషయాలను మాత్రం ప్రపంచ బ్యాంకు వెల్లడించలేదు.