: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కేఎల్ రాహుల్.. లంక జట్టులో మూడు మార్పులు!

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ వేసినప్పుడు 'హెడ్స్' కోరుకున్న కెప్టెన్ కోహ్లీకి అనుగుణంగానే 'హెడ్స్' పడింది. దీంతో రెండో ఆలోచన లేకుండా వెంటనే బ్యాటింగ్ తీసుకున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ చాలా బాగుందని చెప్పాడు. బ్యాటింగ్ కు సహకరించే పరిస్థితులు ఉన్నాయని... ఈ పరిస్థితిని తాము సద్వినియోగం చేసుకుంటామని తెలిపాడు. తొలి టెస్టులో ధావన్ అద్భుతంగా ఆడి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడని... అభినవ్ ముకుంద్ బాగా ఆడినప్పటికీ, రాహుల్ కోసం అతను తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

శ్రీలంక కెప్టెన్ చండిమల్ మాట్లాడుతూ, గత పది రోజుల నుంచి కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పాడు. భారత్ అద్భుతంగా రాణిస్తోందని కితాబిచ్చాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ధావన్ లాగ భారీ ఇన్నింగ్స్ ఆడితే, జట్టుకు లాభిస్తుందని అభిప్రాయపడ్డాడు. జట్టులో మూడు మార్పులు చేశామని... ధనుష్క, కుమార, అసేలలు గాయాల కారణంగా తుది జట్టుకు దూరమయ్యారని... తాను, రంగన హెరాత్, ధనంజయ డిసిల్వ జట్టులోకి వచ్చామని తెలిపాడు.
 
టీమిండియా తుది జట్టు: కేఎల్ రాహుల్, ధావన్, పుజారా, కోహ్లీ, రహానే, అశ్విన్, పాండ్యా, సాహా, జడేజా, ఉమేష్ యాదవ్, సమీ.

శ్రీలంక తుది జట్టు: తరంగ, కరుణరత్నే, మెండిస్, చండిమాల్, మథ్యూస్, డిక్ వెల్లా, డీ సిల్వా, పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్. 

More Telugu News