: మహిళల జడలను కత్తిరించి పారేస్తున్న దుండగులు.. ఢిల్లీ శివారులో భయం భయం.. హడలిపోతున్న గ్రామస్తులు!

ఢిల్లీ శివారులోని కంగన్ హేరి గ్రామ మహిళలు ఇప్పుడు తమ జడలను చేత్తో పట్టుకుని వదలడం లేదు. వదిలితే దానిని ఎవరు కత్తిరించేస్తారోనని హడలిపోతున్నారు. ఆదివారం ముగ్గురు మహిళలు తమ జడలను కోల్పోయారు. సరాసరి వారి ఇంట్లోకే ప్రవేశించిన ఆగంతకులు జడను కత్తిరించి అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. తమ జడను కత్తిరించిన తర్వాత భరించలేనంత తలనొప్పికి గురయ్యామని, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్టు బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. అయితే జడలను కత్తిరించడం వెనక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘటనల వెనక మంత్రగాళ్ల హస్తం ఉండొచ్చని, మంత్ర విద్యల కోసమే జడలను కత్తిరిస్తున్నట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అయితే డీసీపీ సురేందర్ కుమార్ మాత్రం గ్రామస్తుల అనుమానాలను కొట్టిపడేశారు. ఈ ఘటనపై శాస్త్రీయ కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఇటువంటివే హరియాణాలోని గురుగ్రామ్, పల్వాల్, మేవాత్‌లలో జరిగాయి. ఢిల్లీలో జరగడం మాత్రం ఇదే తొలిసారి. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News