: టోల్ గేట్ సిబ్బందిపై కత్తులతో దాడి చేసిన కార్పొరేటర్ తనయుడు!

హైదరాబాదు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో వున్న టోల్ గేట్ సిబ్బందిపై కార్పొరేటర్ కుమారుడు కత్తులతో దాడి చేసిన ఘటన కడ్తాల్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వైపు నుంచి వస్తున్న హైదరాబాదులోని వనస్థలిపురం కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న తనయుడు మనీష్ గౌడ్ ను మైసిగండి టోల్ గేట్ సిబ్బంది టోల్ రుసుం చెల్లించాలని కోరారు. లేకపోతే కారును వెళ్లనీయమని అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహించిన మనీష్ గౌడ్ కార్లోని తన స్నేహితులతో కలిసి టోల్ గేట్ సిబ్బందిపై కత్తులతో దాడికి దిగాడు. దీంతో ఇద్దరు సిబ్బందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు మనీష్ గౌడ్ పై కేసు నమోదు చేసుకుని, వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News