: ఈ ఫ్రిజ్ కి విద్యుత్ తో పని లేదు... ధర కేవలం 4,000 రూపాయలే!

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా కూరగాయల ధరలు నింగికెగశాయి. ఈ నేపథ్యంలో చిన్న కూరగాయ వృథా అయినా ప్రాణం విలవిల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో కూరగాయల వృథాను అరికట్టేందుకు ఢిల్లీలోని జేడీ గొయాంక పబ్లిక్‌ స్కూల్‌ లో సీనియర్ ఇంటర్ చదువుతున్న దీక్షిత కుల్లార్‌ అనే బాలిక సరికొత్త ఫ్రిడ్జ్ కు రూపకల్పన చేసింది. విద్యుత్ అవసరం లేకుండా కేవలం 4,000 రూపాయల ఖర్చుతో ఈ ఫ్రిడ్జ్ ను తయారు చేసి ఆకట్టుకుంది. పర్యావరణ హితమైన విధానంలో పేదలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని ఆలోచించిన దీక్షిత సైన్స్ లోని నిష్క్రియాత్మక ఆవిరి విధానం ద్వారా టెంపరేచర్ స్థిరంగా ఉంచవచ్చని తెలుసుకుంది.

దీంతో ఆహారపదార్థాలు వృథా కాకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ రూపొందించింది. ఇటుకలు, ఇసుక, వెదురు బొంగులు, జనపనార సంచులను ఈ ఫ్రిడ్జ్ తయారీలో ఉపయోగించింది. తొలుత భూమిలో ఇటుకలతో దీర్ఘచతురస్రాకార నిర్మాణాన్ని రూపొందించింది. ఇందులో అలాంటిదే మరో చిన్న ఛాంబర్‌ ను తయారు చేసింది. ఈ ఛాంబర్ కి చిన్న ఛాంబర్ కి మధ్య ఖాళీని అలాగే ఉంచింది. ఈ చిన్న ఛాంబర్ లో మూడు భాగాలు చేసి, ఆ భాగాల మధ్య ఖాళీని ఇసుకతో నింపింది. ఛాంబర్ కు మూతగా వెదురు కర్రలతో తలుపులాంటిదాన్ని తయారు చేసింది. ఇందులో సుమారు 120 కేజీల కూరగాయల వరకు నిల్వ ఉంచుకోవచ్చని, ఇవి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయని చెబుతోంది. ఇందులో ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల మధ్య ఉంటుందని ఆమె చెబుతోంది. దీని తయారీకి సుమారు 4,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. ఈ ఫ్రిడ్జ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. 

More Telugu News