: విజయం కోసం యుద్ధం చేయండి: లక్షలాది మంది సైనికులకు జిన్ పింగ్ పిలుపు

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఉత్తర ప్రాంతంలోని ఓ సైనిక కేంద్రంలో భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించి, పెరేడ్ ను నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం యుద్ధం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, పార్టీ ఆదేశాలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ట్యాంకులు, అణు క్షిపణులను ప్రయోగించే లాంచర్లు, మిలటరీ వాహనాలు, యుద్ధ విమానాలు, వివిధ రకాల సైనిక విభాగాలు తమ సత్తాను చాటుతూ ప్రదర్శన నిర్వహించగా, దాన్ని జిన్ పింగ్ తిలకించారు.

సైన్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. హెచ్-6కే బాంబర్లు, జే-15 ఫైటర్ జెట్ విమానాలు, జే-20 స్టెల్త్ ఫైటర్లు చైనాకు అదనపు బలమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, వాస్తవానికి చైనా ఆర్మీ డే ఆగస్టు 1 కాగా, అందుకు మూడు రోజుల ముందు నుంచే వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సరిహద్దుల్లో ఇండియాతో, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన వేళ, సైనికోత్సవాలకు ప్రాధాన్యత పెరిగిందని అధికార న్యూస్ ఏజన్సీ క్సిన్హువా వెల్లడించింది.

More Telugu News