: నార్త్ కొరియాను అడ్డుకునేందుకు భారత సాయం కోరుతున్న అమెరికా

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని అడ్డుకునేందుకు చైనాతో ఇప్పటికే మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చిన అమెరికా, ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది. ఉత్తర కొరియాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండియా ఉండగా, ఆ దేశానికి ఆహార, ఔషధాలను అత్యధికంగా అందిస్తోంది ఇండియానే. ఇక ఉత్తర కొరియాకు ఇండియా నుంచి ఎగుమతులు ఆపేయగలిగితే, మరింత త్వరగా ఫలితాలను సాధించవచ్చని భావిస్తున్న అమెరికా, ఈ దిశగా ఉపఖండం నుంచి కిమ్ జాంగ్ ఉన్ దేశానికి అందుతున్న సాయాన్ని ఆపించేందుకు అడుగులు వేస్తోంది. శుక్రవారం నాడు ఖండాంతర క్షిపణిని ఆ దేశం విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో, మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, అమెరికా సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, 2016లో ఉత్తర కొరియాకు 110 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, ఇది 30 శాతం తక్కువ. ఇదే సమయంలో నార్త్ కొరియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలకు అనుగుణంగా ఆహార, ఔషధ ఉత్పత్తులు మినహా ఉత్తర కొరియాకు మరేమీ ఎగుమతి చేయరాదని భారత్ నిర్ణయించుకుంది. ఇక వీటిని కూడా నిలుపుదల చేయిస్తే, కిమ్ పై మరింత ఒత్తిడిని పెంచవచ్చన్నది అమెరికా ఆలోచనగా తెలుస్తోంది.

More Telugu News