: 17 పట్టణాల్లో కొండెక్కి కూర్చున్న టమాటా... ఆగస్ట్ వరకు ఇంతే.. త్వరలో ఉల్లి వంతు!

టమాటా ధరలు ఇప్పట్లో దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా 17 పట్టణాల్లో టమాటా ధరలు గరిష్ట స్థాయిలోనే కిలో ఒక్కింటికి రూ.90 దగ్గర విక్రయమవుతున్నాయి. వీటిలో రాజధాని ఢిల్లీతోపాటు కోల్ కతా, ఇండోర్, తిరువనంతపురం కూడా ఉన్నాయి. ఢిల్లీలో మూడు నెలల క్రితం రూ.26 ఉన్న టమాటా ఇప్పుడు రూ.92కు చేరింది. చెన్నైలో ఏప్రిల్ - జూలై మధ్య కాలంలో టమాటా ధరలు ఐదు రెట్లు పెరగడం గమనార్హం. అటు బెంగళూరులోనూ ఆరు రెట్లు పెరిగింది. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో ఇప్పటికిప్పుడు సరఫరా పరిస్థితులు మెరుగపడే అవకాశాల్లేవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆగస్ట్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఇన్నాళ్లు చల్లగా ఉన్న ఉల్లి ధర కూడా క్రమంగా పై వైపునకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్ గాన్ లో క్వింటాలు ఉల్లిగడ్డల ధర రూ.1,300కు చేరింది. ఇది 19 నెలల గరిష్ట ధర. గతంలో రోజుకు 25,000 క్వింటాళ్ల సరుకు రాగా, ప్రస్తుతం అది 12,000 క్వింటాళ్లకు తగ్గుముఖం పట్టింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి సాగు లేదని, ప్రస్తుతం వస్తున్న పంట అంతా మార్చి, ఏప్రిల్ లో దిగుబడి అయిందని, స్టోరేజీల నుంచి వాటిని బయటకు తీస్తున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, చాలా మంది రైతులు ఇప్పటికే తమ పంటను అమ్మేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే ఉన్న పంట అంతా వ్యాపారుల దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది. దీంతో ధరపై ఇక వారిదే ఆధిపత్యం. ఈ క్రమంలో త్వరలోనే ఉల్లి కూడా కన్నీళ్లు తెప్పించే ధరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News