: రూ. 5599ల‌కే సింగ‌పూర్... విమాన ప్ర‌యాణాల‌పై భారీ త‌గ్గింపు

నేరుగా హైద‌రాబాద్ నుంచి సింగ‌పూర్, ఇండోనేషియా, హాంకాంగ్ దేశాలకు అతి త‌క్కువ ఛార్జీతో వెళ్లే అవ‌కాశాన్ని సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్కూట్ విమాన‌యాన సంస్థ క‌ల్పించింది. సింగ‌పూర్‌కు చెందిన టైగ‌ర్ ఎయిర్‌, స్కూట్‌లు విలీన‌మ‌వ‌డంతో భార‌త్ నుంచి ఈ ప్ర‌త్యేక డిస్కౌంట్లు ఆఫ‌ర్ చేశారు. సింగ‌పూర్‌కు రూ. 5599, హాంకాంగ్‌కు రూ. 11,199, బాలీకి రూ. 11,799ల‌కే విమాన స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంత‌కుముందు బెంగ‌ళూరు, కొచ్చి, హైద‌రాబాద్ స‌హా మ‌రో 5 న‌గ‌రాల నుంచి టైగ‌ర్ ఎయిర్ సేవ‌లందించేది. కోల్‌క‌తా స‌హా మ‌రో 3 ప్రాంతాల నుంచి స్కూట్ ఎయిర్‌లైన్స్ సేవ‌లుండేవి. ఇప్పుడు ఇవి రెండూ విలీన‌మై స్కూట్ పేరుతో సేవ‌లందిస్తున్న‌ట్లు స్కూట్ భార‌త అధిప‌తి మ‌హ‌దేవ‌న్ తెలిపారు. ప్ర‌స్తుతం వారానికి 50 స‌ర్వీసులు న‌డుపుతున్నా, భార‌త విమాన‌యాన సంస్థ‌ల‌తో స‌రైన ఒప్పందాలు లేక‌పోవ‌డంతో స్కూట్ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించే అవ‌కాశం లేకుండా పోయింద‌ని మ‌హ‌దేవ‌న్ వివ‌రించారు.

More Telugu News