: జియోను ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ కొత్త ఎత్తులు.. బండిల్ ఆఫర్లకు రెడీ!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ భారీ వ్యూహాలు రచిస్తోంది. జియో ప్రకటించిన 4జీ ఫీచర్ ఫోన్ అందుబాటులోకి వస్తే తమ వ్యాపారం కుదేలవడం ఖాయమని భావిస్తున్న భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికిప్పుడు జియోలా సరికొత్తగా 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో జతకట్టి బండిల్ ఆఫర్లు ప్రకటించాలని యోచిస్తోంది. దేశంలో వీవోఎల్టీఈ సేవలను జియో ఒక్కటే అందిస్తుండగా వచ్చే ఏడాది నుంచి ఎయిర్‌టెల్ కూడా వీవోఎల్టీఈ సర్వీసులు అందించనుంది.

కాగా, జియో కంటే ముందే దేశీయ మొబైల్ మేకర్ లావా 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే దీని ధర కాస్త ఎక్కువే. ఇప్పుడు  మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, కార్బన్‌ తదితర కంపెనీలు కూడా 4జీ ఫీచర్ ఫోన్‌ తయారీపై దృష్టిసారించాయి. దీనిని తనకు అవకాశంగా మార్చుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఆయా కంపెనీలతో కలిసి బండిల్ ఆఫర్లు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మరి.. ఎయిర్‌టెల్ వ్యూహం జియోను ఎంతవరకు అడ్డుకోగలుగుతుందో వేచి చూడాల్సిందే.

More Telugu News