: ప్రధాని మోదీ నన్ను కన్నీటితో ఓదార్చారు: వెంకయ్యనాయుడు

భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్న వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దేశంలోనే రెండో అత్యున్నత పదవికి పోటీపడుతున్న ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులో వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు సుజనా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ డీజిపీలు దినేష్ రెడ్డి, రాముడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరోలు నాగార్జున, వెంకటేశ్, నటుడు మురళీమోహన్, సుద్దాల అశోక్ తేజ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, చిన్నతనంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యానని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పార్టీ తనను జాతీయ ఉపాధ్యక్షుడిని చేసిందని చెప్పారు. అమ్మలాంటి పార్టీకి ఇప్పుడు దూరమవడం తనకు ఎంతో బాధగా ఉందని అన్నారు. అయితే, ప్రధాని మోదీ తనను కన్నీటితో ఓదార్చి, సముదాయించారని చెప్పారు. 2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనేది తన నిర్ణయమని, పదవిలో ఉండగానే రాజకీయాలు వదిలేసి, సామాజిక సేవలో పాల్గొంటానని తెలిపారు. తాను ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని, వాటంతట అవే వచ్చాయని చెప్పారు.

More Telugu News