: రామ్ మాధవ్ కాళ్లను జగన్ పట్టుకున్నాడు.. 10 రోజుల నుంచి గజగజా వణుకుతున్నాడు: వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు

తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లను దండుకుని జైలుకు వెళ్లి, చిప్పకూడు తిన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు గజగజలాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. 11 అక్రమాస్తుల కేసులు, 5 ఈడీ కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్... కేసుల నుంచి బయట పడేందుకు బీజేపీ నేతల కాళ్లను పట్టుకుంటున్నారని ఆరోపించారు. చివరకు బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ కాళ్లను కూడా జగన్ పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడని... ఢిల్లీ, ముంబైకి చెందిన టాప్ లాయర్లతో తన లోటస్ పాండ్ లో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారని విమర్శించారు. కేసుల నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఆయన దృష్టి సారించారని అన్నారు.

జాతీయ స్థాయి నేతలు ఎవరు కనపడినా వారికి సాష్టాంగ ప్రణామాలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నాడని వర్ల ఎద్దేవా చేశారు. ఫోన్ ద్వారానే అపాయింట్ మెంట్ తీసుకుని గవర్నర్ ను ఎందుకు ఏకాంతంగా కలిశారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ను కలవడం తప్పని తాము అనడం లేదని... గంటసేపు ఆయనతో ఏం చర్చించారో చెప్పాలనే తాము అడుగుతున్నామని తెలిపారు. తనకు తెలిసినంత వరకు రాష్ట్రంలో అంతగా హడావుడి పడాల్సిన సమస్యలు ఏమీ లేవని అన్నారు. దేనిపై చర్చించారన్న విషయాన్ని ఇంతవరకు జగన్ చెప్పలేదని, గవర్నర్ పేషీ కూడా వెల్లడించలేదని... ఏ అంశంపై చర్చ జరిగిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

కేసుల భయంతో జగన్ వణికి పోతున్నారని... గత 10 రోజుల నుంచి ఆయన నుంచి ఒక్క స్టేట్ మెంట్ కూడా లేదని వర్ల అన్నారు. జగన్ అసలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అజ్ఞాతంలో ఉండరాదని... రాష్ట్ర పజలకు ఆయన కనపడుతూ ఉండాలని అన్నారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డిపై కూడా వర్ల మండిపడ్డారు. విజయసాయి ఫ్లవర్ బొకేల కంపెనీ ఏమైనా పెట్టారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో బొకేల వ్యాపారాన్ని పార్ట్ టైమ్ జాబ్ గా చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. కనపడిన వారందరికీ బొకేలు ఇస్తూ పోతున్నారని... అంత అవసరం ఏముందని ప్రశ్నించారు.

More Telugu News