: భారత్ వాదనతో అమెరికా ఏకీభవిస్తూ పాక్ ను నిందిస్తోంది: పాక్ పత్రిక సంచలన కథనం

భారత్ కు అమెరికా వత్తాసు పలుకుతోందని పాకిస్థాన్ కు చెందిన వార్తాపత్రిక సంచలన కధనం ప్రచురించింది. భారత్ పట్ల పాక్ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరికలు జారీ చేసినట్టు ఆ కథనం తెలిపింది. భారత్ వాదనతో ఏకీభవిస్తూ, పాక్ మాత్రమే తప్పులు చేసినట్టుగా అమెరికా చెబుతోందని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పేందుకు తక్షణం భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ తో చర్చలు మొదలు పెట్టాలని సూచిస్తూ అమెరికా ఆదేశాలు జారీ చేసిందని ఆ పత్రిక తెలిపింది.

అంతే కాకుండా భారత్ తో చర్చలు మొదలు పెట్టాల్సిందేనని అమెరికా స్ఫష్టం చేసిందని పత్రిక వెల్లడించింది. ఇదే సమయంలో ఉగ్రవాద నిరోధానికి ఏం చెయ్యాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. ఉగ్రవాద నిరోధానికి పాక్ కంటే భారత్, ఆఫ్ఘాన్ దేశాలే ఎక్కువ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఉగ్రవాద నిరోధం విషయంలో పాక్ చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని, ఆ కారణంతోనే ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తున్నామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌ తో చర్చలు మొదలుపెట్టాల్సిందేనంటూ అమెరికా పాక్ ను ఒత్తిడి చేస్తోందని ఈ కథనంతో తెలుస్తోంది. 

More Telugu News