: చారిత్రాత్మక మార్కు 10,000ను తాకిన నిఫ్టీ!

ఎన్ఎస్ఈ నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా ఐదంకెల మార్కు 10,000ను అధిగమించి 10,011 పాయింట్ల గరిష్ట రికార్డు ఈ రోజు నమోదు చేసింది. దేశ, విదేశీ పెట్టుబడులతో ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టీ 22 శాతం లాభపడడం విశేషం. దీంతో ప్రపంచంలో చక్కని పనితీరు చూపిన సూచీగా నిఫ్టీ నిలిచింది. అటు బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 32,363 పాయింట్ల వరకూ ఎగిసింది. నిఫ్టీ సూచీని 1996లో 1,000 బేస్ పాయింట్ల వద్ద ప్రారంభించారు. సరిగ్గా 21 ఏళ్ల కాలంలో పది రెట్లు పెరిగింది. అంటే 1996లో నిఫ్టీ సూచీలో 1,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అది నేడు రూ.10,000 అయి ఉండేది. ప్రతి ఆరేళ్లకు రెట్టింపైంది.

సానుకూలతలు
కేంద్రం చేపట్టిన జీఎస్టీ తదితర సంస్కరణలు, ద్రవ్యలోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు కూడా దిగిరావడం, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, రూపాయి విలువ బలోపేతం కావడం, విదేశీ నిధుల వెల్లువ, మంచి వర్షాలు, ఇవన్నీ సానుకూలతలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ 12,000 మార్కును చేరుకుంటుందని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ రీసెర్చ్ హెడ్ ప్రభాకర్ అంటున్నారు.

More Telugu News