: మతిమరుపు రోగులకు ప్రత్యేకంగా ఓ ఊరు.. రూ.128 కోట్లతో కట్టేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా!

మతిమరుపు (డెమెన్షియా) రోగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. 20 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.128 కోట్లు)తో అన్ని సదుపాయాలతో అందమైన ఊరును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణ టాస్మేనియాలోని హోల్‌బాట్‌లో నిర్మించనున్న ‘డెమెన్షియా విలేజ్’లో 15 దర్జీ ఇళ్లతోపాటు సూపర్ మార్కెట్, సినిమా, కేఫ్, బ్యూటీ సెలూన్, గార్డెన్ తదితరాలు కూడా వుంటాయి. మతిమరుపు రోగులు పూర్తి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతోనే దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో నివసించే వారు సామాజిక కార్యక్రమాలు సహా అన్నింటిలోనూ పాల్గొనేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.

కాగా, నెదర్లాండ్స్‌లో ఇప్పటికే ఇటువంటి గ్రామం ఒకటి ఉంది. 2009లో డి హోగెవెక్‌లో మతిమరుపు రోగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న రోగుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటువంటి గ్రామమే ఐర్లాండ్‌లో నిర్మితమవుతోంది. ఇక్కడ కూడా కేఫ్, బ్యూటీ సెలూన్, జిమ్, గార్డెన్లు తదితర వాటిని నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా ఆస్ట్రేలియాలో నిర్మించనున్న డెమెన్షియా విలేజ్‌లో 90 ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 18 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

More Telugu News