: జహీర్‌తో ఒప్పందం ఏడాదికి 150 రోజులే.. స్పష్టం చేసిన గంగూలీ

టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్ జహీర్‌ఖాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టత ఇచ్చాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మీడియాతో మాట్లాడిన గంగూలీ.. జహీర్‌ఖాన్‌తో కాంట్రాక్ట్ ఏడాదికి 150 రోజులు మాత్రమేనన్నాడు. బీసీసీఐ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. టూర్-టు-టూర్ పద్ధతిపైనే జహీర్‌ను నియమించినట్టు పేర్కొంది. అంటే ఏడాదికి ఐదు నెలలు మాత్రమే అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడని వివరించింది.

జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభీష్టానికి వ్యతిరేకంగా జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని రవి సైతం మీడియా ముందు చెప్పడంతో వివాదం చెలరేగింది. జహీర్‌ అత్యుత్తమ బౌలరే అయినా కోచింగ్ నైపుణ్యం లేదని పేర్కొని కలకలం రేపాడు. అందుకే అతడిని బౌలింగ్ కన్సల్టెంట్‌గా, భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని ఒత్తిడి కూడా తెచ్చినట్టు తెలిసింది. అతడి ఒత్తిడికి తలొగ్గిన బీసీసీఐ జహీర్‌ను బౌలింగ్ కన్సల్టెంట్‌గా తీసుకున్నట్టు ప్రకటించింది. జహీర్‌ఖాన్, ద్రవిడ్‌లను కన్సల్టెంట్లుగానే నియమించినట్టు బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. విదేశీ పర్యటనల్లో వారు పాలుపంచుకుంటారని తెలిపింది.

More Telugu News