: కోచ్ల విధివిధానాలను విరాట్ అర్థం చేసుకోవాలి: గంగూలీ
భారత జట్టు కోసం ప్రధాన కోచ్ ఎంపికలో భాగంగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన త్రిసభ్య కమిటీ ఇంకొంత సమయం కోరిన సంగతి తెలిసిందే. కోచ్ ఎంపిక విధానాలను వివరిస్తూ గంగూలీ భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఒక సందేశం ఇచ్చారు. `కోచ్ల విధివిధానాలను ముందు విరాట్ అర్థం చేసుకోవాలి. కోచ్ ఎంపికలో తలదూర్చకుండా ఉన్నందుకు ముందు విరాట్ను మెచ్చుకోవాలి. అతను వెస్టిండీస్ నుంచి తిరిగి రాగానే ఈ విషయం గురించి వివరంగా చర్చిస్తాం` అని గంగూలీ అన్నారు.
ఇప్పటికే ఐదుగురిని ఇంటర్వ్యూ చేసిన త్రిసభ్య కమిటీ, రెండేళ్ల పాటు భారత జట్టు కోచ్ గా కొనసాగే వ్యక్తిని ఎంపిక చేయాలంటే మరికొంత సమయం కావాలని కోరింది. కొత్త కోచ్పై కూడా ఎలాంటి అపవాదులు, ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు వీలైనంత ఎక్కువ మందితో చర్చించే ప్రయత్నం చేస్తున్నామని గంగూలీ స్పష్టం చేశారు. సెహ్వాగ్, రవిశాస్త్రి, లాల్చంద్ రాజ్పుత్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్లను ఇంటర్వ్యూ చేసిన కమిటీ జూలై 26న ప్రారంభంకానున్న శ్రీలంక టూర్కి ముందే కొత్త కోచ్ను ఎంపిక చేస్తామని తెలిపింది.