: ఇజ్రాయెల్‌లో మోదీకి అరుదైన గౌరవం.. చామంతి పువ్వుకు భారత ప్రధాని పేరు!

తొలిసారిగా ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. అక్కడ వేగంగా పెరిగే ఓ పుష్పానికి మోదీ పేరు పెట్టారు. దీంతో ఇక నుంచి అక్కడ పెరిగే చామంతిని ‘మోదీ’గా పిలవనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ఇక నుంచి వేగంగా పెరిగే ఇజ్రాయెల్ చామంతికి ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం ఆయన పేరును పెట్టాం. ఇక నుంచి అది ‘‘మోదీ’’గా పిలవబడుతుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

అంతకుముందు మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో కలిసి మిష్మర్ హషివాలోని డాంజిగర్‌ ‘‘డాన్’ పూల క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ ఫ్లోరికల్చర్‌లో ఉపయోగిస్తున్న అత్యాధునిక పరిజ్ఞానం గురించి ఇరు దేశాల అధినేతలు చర్చించారు. డాంజిగర్ ఫ్లవర్ ఫామ్ ఇజ్రాయెల్‌లో ప్రముఖ ఫ్లోరికల్చర్ కంపెనీల్లో ఒకటి. ఇక్కడ 80 వేల చదరపు మీటర్లలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గ్రీన్ హౌస్ ఉంది. ఇందులో మొక్కల పునరుత్పత్తిపై స్పెషలైజేషన్ చేస్తారు.

More Telugu News