: వివో నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారి అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ ఆవిష్కరణ!

స్మార్ట్‌ఫోన్ సాంకేతికతలో చైనా మొబైల్ మేకర్ వివో మరో అద్భుతానికి తెరతీసింది. టెక్ దిగ్గజాలు శాంసంగ్, ఆపిల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రపంచంలోనే తొలిసారి అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఫలితంగా డివైజ్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రత్యేకంగా బటన్‌తో అవసరం ఉండదు.

క్వాల్‌కామ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆధారంగా ఆవిష్కరించిన ఈ సాంకేతికలో.. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లే స్క్రీన్ లోపల అమరుస్తారు. అది బయటకు కనిపించకున్నా చక్కగా పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ సెన్సార్‌లోని అల్ట్రాసోనిక్ తరంగాలు యూజర్ ఫింగర్ ప్రింట్‌ ఆధారంగా ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. అంతేకాదు యూజర్ వేలు తడిగా ఉన్నా సరే వేలిముద్రను గుర్తించి ఫోన్‌ను అన్‌లాక్ చేయడం ఈ అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ప్రత్యేకత. జూన్ 28న చైనాలోని షాంగైలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017లో ఈ సాంకేతికతను వివో ఆవిష్కరించింది. జూలై 1 వరకు ఈ ఎక్స్‌పో కొనసాగనుంది.

More Telugu News