: పాకిస్థాన్ ఫైనల్స్ చేరడానికి కారణం ఇదే: కోహ్లీ

ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. ట్రోఫీని సాధించడానికి ఇరు జట్లు పూర్తి స్థాయిలో కసరత్తులు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టే ట్రోఫీని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. టోర్నీలో ఇప్పటి వరకు తాము మెరుగైన ప్రదర్శన చేశామని, అందుకే ఫైనల్స్ చేరుకున్నామని తెలిపాడు. తమలాగే పాకిస్థాన్ కూడా బాగా ఆడినందువల్లే ఫైనల్స్ కు వచ్చిందని చెప్పాడు.  

పాక్ జట్టు బలాలు, బలహీనతలు రెండూ తమకు తెలుసని... గ్రూపు దశలో పాక్ ను బోల్తా కొట్టించిన విధంగానే ఫైనల్స్ లో కూడా ఓడిస్తామని కోహ్లీ తెలిపాడు. ఈ క్రమంలో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతామని చెప్పాడు. సెమీస్ లో తృటిలో సెంచరీ మిస్ కావడంపై స్పందిస్తూ, దీనిపై మాట్లాడటానికి ఏమీ లేదని అన్నాడు. తాను చేసిన పరుగులు జట్టు విజయానికి దోహదపడితే చాలని చెప్పాడు. ఫైనల్స్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని తెలిపాడు.  

More Telugu News