: నేటి మ్యాచ్ కి వరుణుడి భయం... మ్యాచ్ ఆగితే సెమీస్ కు భారత్

చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ లో స్థానం కోసం దక్షిణాఫ్రికాతో నేడు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కి వరుణుడి నుంచి ముప్పు పొంచివుంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ ప్రాంతమంతా మబ్బులు పట్టి ఉండగా, నిన్న కూడా ఇక్కడ భారీ వర్షం పడింది. మ్యాచ్ ని వర్షం అడ్డుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉండటంతో, అలా జరిగినా భారత్ సెమీస్ కు వెళుతుంది. గ్రూప్ - బిలోని అన్ని జట్లూ తలా రెండు పాయింట్లతో ఉండగా, భారత్ మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేటుతో ఉండటమే ఇందుకు కారణం. మ్యాచ్ రద్దయితే దక్షిణాఫ్రికా, భారత్ లకు చెరో పాయింట్ వస్తుంది. అదే జరిగితే, 1.272 నెట్ రన్ రేటుతో ఉన్న భారత్ మరో గణాంకం చూడకుండా సెమీస్ కు వెళుతుంది. గ్రూప్ -బీ లోని చివరి మ్యాచ్ రేపు శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరగనుండగా, ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దయితే, దక్షిణాఫ్రికా సెమీస్ కు వస్తుంది.

More Telugu News