: గోవా సన్యాసినికి వాటికన్ లో అరుదైన అవకాశం!

వాటికన్ సిటీలో క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వద్ద అరుదైన అవకాశాన్ని గోవాకు చెందిన సన్యాసిని సిస్టర్ లూసీ బ్రిట్టో దక్కించుకుంది. పోప్ కు వచ్చే మెయిల్ బాక్స్ ను తెరచి వాటిలోని గ్రీటింగ్స్, ప్రార్థనల కోరికలు, సాయం కోరే వారి ఉత్తరాలను వేరు చేసే అవకాశం ఆమెకు దక్కింది. సిస్టర్ లూసీ దక్షిణ గోవాలోని కుంకోలిమ్ ప్రాంతంలో పుట్టి పెరిగారు. గడచిన 13 సంవత్సరాలుగా వాటికన్ సిటీలోనే ఉంటున్న ఆమె, మూడు ఫాంటిఫ్ లను పొందారు. వాటికన్ సెక్రటేరియట్ లో విధులను నిర్వర్తించే 300 మందికి పైగా ఉద్యోగుల్లో భారత్ కు చెందిన మహిళ ఈమె ఒక్కరే కావడం గమనార్హం.

 ప్రస్తుతం 69 సంవత్సరాల వయసున్న లూసీ, పోప్ బెనడిక్ట్ - 16, పోప్ జాన్ పాల్ - 2 వద్ద కూడా పని చేశారు. తానిప్పుడు రోజుకు ఏడు గంటలకు పైగా ఉత్తరాలను చూసే విధుల్లో ఉన్నానని, నిత్యమూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాలను క్రోఢీకరించి, వాటికన్ రేడియోకు సమాచారాన్ని అందించే విధుల్లో ఉన్నానని, ఈ బాధ్యత తనకెంతో సంతృప్తిని అందిస్తోందని ఆమె చెబుతున్నారు. ఇక్కడికి ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ నుంచి అధికంగా ఉత్తరాలు వస్తుంటాయని, ఇండియా నుంచి వచ్చే ఉత్తరాల్లో అత్యధికం కేరళ నుంచే ఉంటాయని సిస్టర్ లూసీ వెల్లడించారు.

More Telugu News