: కోహ్లీ, డివిలీర్స్ కొంప ముంచిన మహిళా జర్నలిస్టు సెల్ఫీ.... శ్రీలంక కెప్టెన్ తో సెల్ఫీ దిగమంటున్న పాక్ అభిమానులు!

పాకిస్తాన్‌ స్పోర్ట్స్ ఎనలిస్టు జైనాబ్ అబ్బాస్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అకస్మాత్తుగా ఆమె పేరు ఎందుకు మార్మోగిపోతోందంటే...ఆమె కోహ్లీ, ఏబీ డివిలీర్స్ ని డకౌట్ చేసింది కనుక... అదేంటి ఆమె డకౌట్ చేయడమేంటనే అనుమానం వచ్చిందా?... అవును పాకిస్తాన్‌ స్పోర్ట్స్ ఎనలిస్టు జైనాబ్ అబ్బాస్ ఛాంపియన్స్ ట్రోఫీ అప్ డేట్స్ అందించేందుకు ఇంగ్లండ్ లో ఉంది. పాకిస్థాన్ తో సౌతాఫ్రికా మ్యాచ్ ఆడే ముందు సఫారీ కెప్టెన్ ఏబీ. డివిలీర్స్ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్ లో డివిలీర్స్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.

అలాగే, మొన్న శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడేందుకు ముందు స్టేడియంకి వచ్చిన జైనాబ్ అబ్బాస్... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్ లో కోహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ఆమెది ఐరన్ లెగ్ అంటూ కోహ్లీ, డివిలీర్స్ అభిమానులు మండిపడుతుండగా...పాకిస్థానీలు మాత్రం సంబరపడిపోతున్నారు. సోమవారం పాకిస్థాన్ జట్టు శ్రీలంకతో తలపడనున్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లతో సెల్ఫీ దిగాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. వారందరికీ జైనాబ్ సరదాగా సమాధానాలిస్తోంది.




More Telugu News