: జియో పుణ్యమా అని.. డేటా రేట్లు తగ్గడంతో భారతీయులు చేస్తున్న ఘనకార్యం!

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో అరంగేట్రంతో ఆ రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు ఆకాశంలో ఉన్న డేటా రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. వినియోగదారులకు దాదాపు ఆరు నెలలపాటు ఉచితంగా డేటా, వాయిస్ కాల్స్ సేవలు అందడంతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అంతంత డేటాను ఏం చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సతమతమయ్యారు. జియో రాకతో ఇతర నెట్‌వర్క్ కంపెనీలు తమ కస్టమర్లను నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడ్డాయి, ఇంకా పడుతున్నాయి. డేటా రేట్లు తగ్గిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

సరిగ్గా ఇప్పుడీ ప్రయత్నమే భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పక్కదారులు పట్టిస్తోంది. డేటా చవగ్గా లభిస్తుండడంతో వారంతా పోర్న్ సైట్లవైపు మొగ్గుచూపుతున్నారు. డేటా రేట్లు తగ్గిన తర్వాత అడల్ట్ సైట్లను చూసేవారి సంఖ్య 75 శాతానికిపైగా చేరుకుందని వీడియో వ్యూయర్‌షిప్ ట్రాకర్ విడూలీ పేర్కొంది. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఇది అధికంగా ఉందని తెలిపింది. అయితే కావాల్సినంత డేటా అందుబాటులో ఉండడం వల్ల అడల్ట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోకుండా నేరుగా సైట్లలోనే వీక్షిస్తున్నారట.

 ఈ కారణంగా మార్చి నెలాఖరు నాటికి డేటా వాడకం 1300 మిలియన్ జీబీలు పెరిగింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువ. ఆన్‌లైన్ వీడియో వ్యూయర్‌షిప్ 75 శాతం, అడల్ట్ కంటెంట్ వాచ్‌టైమ్ కేటగిరీలో 60 శాతానికి పెరిగినట్టు విడూలీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుబ్రత్ కర్ తెలిపారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వీడియో వ్యూయర్‌షిప్‌ను విడూలీ ట్రాక్ చేస్తుంది. ఇక పోర్న్ కాకుండా మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ (ప్రాంతీయ వార్తలు), కామెడీ షోలను ఎక్కువగా 18-34 మధ్య వయసున్న వారు వీక్షిస్తున్నారు. ఈ నాలుగు కేటగిరీల్లో 40 శాతం వరకు వ్యూయర్‌షిప్ పెరిగినట్టు సుబ్రత్ వివరించారు.

More Telugu News