: 'ఛాంపియన్స్' టైమ్: 8 జట్లు, 2 గ్రూపులు, 5 మ్యాచ్ లు!

మినీ వరల్డ్ కప్  గా భావించే ఛాంపియన్స్ ట్రోపీ సమరం నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూపులుగా ఐసీసీ లాటరీ పధ్ధతిలో ఈ టాప్ 8 జట్లను విడగొట్టింది. గ్రూప్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ జట్లు ఉండగా, గ్రూప్‌ ‘బి’లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడుతుంది. ఇందులో గెలిచిన పాయింట్ల ఆధారంగా ఒక్కో గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు సెమీఫైనల్‌ కు అర్హత సాధిస్తాయి.

రెండు సెమీ ఫైనల్ విజేత జట్ల మధ్య జూన్‌ 18న.... టోర్నీ ప్రారంభమైన ఓవల్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ ను కూడా నిర్వహించనున్నారు. ఆ రోజు విజేత ఎవరో తేలిపోనుంది. ఈ టోర్నీ మొత్తం కేవలం మూడు స్టేడియంలలోనే జరుగుతుంది. ఓవల్‌, బర్మింగ్‌ హామ్, కార్డిఫ్‌ స్టేడియంలు ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. 2013లో టోర్నీ నిర్వహించిన విధానాన్నే ఈసారి కూడా ఐసీసీ అనుసరించడం విశేషం.

డిఫెండింగ్ ఛాంపియన్ గా టీమిండియా టోర్నీ ఫేవరేట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది. ఇక వెస్టిండీస్ ఈ టోర్నీలో లేదు. బుకీలతో సహా క్రీడా విశ్లేషకులంతా 'టోర్నీ విజేత'గా ఇంగ్లండ్ ను అంచనా వేస్తున్నారు. స్వదేశంలో టోర్నీ జరగడంతో పాటు, జట్టు ఫాం, నిలకడ, వనరులను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వస్తున్నారు. దాని తరువాతి స్థానాల్లో ఆసీస్, సఫారీ, టీమిండియా జట్లను పేర్కొంటున్నారు.

More Telugu News