: కోహ్లీని ఆకట్టుకున్న దినేష్ కార్తీక్... పాక్ తో మ్యాచ్ లో టీమిండియా కూర్పు ఇలా ఉండే అవకాశం?

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సన్నాహక మ్యాచ్ లు ముగిశాయి. జూన్ 4న పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ కోసం టీమిండియా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై టీమిండియా పేసర్లు అద్భుతంగా రాణించడం... భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ వనరులపై టీమిండియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓపెనింగ్ జోడీగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ రానుండగా.. మూడో నెంబర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఖాయం. నాలుగో నెంబర్ లో దిగే ఆటగాడిపై ఉత్కంఠ నెలకొంది. అజింక్య రహానేను తుది జట్టులోకి తీసుకోవాలా? లేక దినేష్ కార్తీక్ ను తీసుకోవాలా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఈ డౌన్ లో దిగే ఆటగాడిపై చాలా ఒత్తిడి ఉంటుంది. టాప్ ఆర్డర్ విఫలమైతే బాధ్యత తలకెత్తుకోవాల్సింది ఈ నంబర్ లో బ్యాటింగ్ కు దిగేవాడే.

రహానే రెండు సన్నాహక మ్యాచ్ లలో విఫలమయ్యాడు. కానీ సాంకేతికంగా ద్రవిడ్ లాంటి ఆటగాడు. మరోవైపు, ఒక సన్నాహక మ్యాచ్ లో విఫలమైనా... పేస్ బౌలింగ్ కు పూర్తిగా అనుకూలించే పిచ్, వాతావరణ పరిస్థితుల్లో బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 94 పరుగులు చేసి, రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన దినేష్ కార్తీక్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. ప్రధానంగా కెప్టెన్ కోహ్లీని ఆకట్టుకుంది. దీంతో పాక్ తో మ్యాచ్ లో కార్తీక్ ని ఆడించే అవకాశం కనబడుతోంది. అదే సమయంలో దినేష్ కార్తీక్ స్పెషలిస్టు కీపర్ మరియు బ్యాట్స్ మన్ అన్న సంగతి తెలిసిందే. ఐదవ స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు రానున్నాడు, ఆ తరువాత ఆర్డర్ లో ధోనీ బ్యాటింగ్ కు వస్తాడు.

కాగా, ధోనీ పేలవమైన ఫాంలో ఉన్నాడు. అయితే మంచి మ్యాచ్ ఫినిషర్ గా ఉన్న ధోనీ స్థానంలో స్పెషలిస్టు కీపర్ అయిన కార్తీక్ ను కోహ్లీ దించే ధైర్యం చేయగలడా? అన్నది ప్రశ్నార్థకం. ఏడవ నెంబర్ ఆటగాడిగా హార్ధిక్ పాండ్య, ఎనిమిదవ నెంబర్ లో అశ్విన్, తొమ్మిదవ నెంబర్ లో రవీంద్ర జడేజా, పదో ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్, పదకొండో ఆటగాడిగా షమి బ్యాటింగ్ చేయవచ్చు. ఎక్స్ ట్రా ప్లేయర్స్ గా కేదార్ జాదవ్, ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా ఉండనున్నారు. అదనపు ఆటగాడిగా సురేష్ రైనా సిద్ధంగా ఉన్నాడు.

More Telugu News