: ఈసారి అమెరికాకు దక్షిణ కొరియా షాక్!

తనకు నచ్చింది మాత్రమే చేస్తానని, ఇతరులు చెప్పింది కూడా విననని స్పష్టం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ పరీక్షలతో షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రతి విషయంలోనూ అమెరికాకు వంత పాడే దక్షిణ కొరియా తొలిసారి అమెరికాకు షాకిచ్చింది. చైనా, ఉత్తరకొరియాలపై నిఘా లక్ష్యంతో అమెరికా అత్యాధునిక రాడార్లతో కూడిన టర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ (థాడ్‌) వ్యవస్థను దక్షిణ కొరియాలో ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, ధాడ్ వ్యవస్థ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని దక్షిణ కొరియా భరించాల్సి ఉంటుందని సూచించారు.

దీంతో దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌ ఈ వ్యవస్థపై దృష్టిసారించారు. ఈ వ్యవస్థలో కొన్ని అదనంగా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో తెలపాలని దర్యాప్తుకు ఆదేశించారు. ఎన్నికల ప్రచారం నాటి నుంచి మూన్ మద్దతుదారులు ధాడ్ వ్యవస్థ మోహరింపును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్యాప్తు ఆదేశం అమెరికాకు షాకిచ్చినట్టేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉదారవాదిగా పేరున్న మూన్‌ ఆది నుంచి ఉత్తరకొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నారు.

More Telugu News