: బ్రిటన్‌లో తారస్థాయికి చేరిన ఉగ్ర భయం.. 2007 తర్వాత తొలిసారి భారీగా మోహరిస్తున్న భద్రతా బలగాలు!

మాంచెస్టర్ లో సోమవారం రాత్రి జరిగిన ఉగ్రదాడితో మంగళవారం ఉగ్ర భయం తారస్థాయికి చేరుకుంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరిస్తున్నట్టు బ్రిటిష్ ప్రధాని థెరిసా మే తెలిపారు. ఈ దాడితో పలువురికి సంబంధాలున్నాయని, ఎవరినీ తేలిగ్గా తీసుకోబోమని ఆమె హెచ్చరించారు. సోమవారం రాత్రి మాంచెస్టర్ ఎరీనాలో జరిగిన ఉగ్రదాడిలో చిన్నారుల సహా 22 మంది మృతి చెందారు.

ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మాట్లాడుతూ వ్యూహాత్మక ప్రదేశాల్లో విధుల్లో ఉన్న వారి స్థానంలో తాత్కాలికంగా సాయుధ దళాలను మోహరించనున్నట్టు తెలిపారు. కాన్సెర్ట్‌లు, క్రీడలు జరిగే ప్రదేశాల్లో వీరిని మోహరించనున్నట్టు తెలిపారు. 2007లో గ్లాస్గో విమానాశ్రయంలో కారు బాంబు దాడి  తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఉగ్ర భయం తారస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇటువంటి దాడులతో ఉగ్రవాదులు విజయం సాధించలేరని, మాంచెస్టర్, బ్రిటన్ స్ఫూర్తిని దెబ్బతీయలేరని ఈ సందర్భంగా ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు.

More Telugu News