: ఐపీఎల్‌లో అసలైన మజా.. నేడే ఫైనల్స్.. కప్పు కొల్లగొట్టేదెవరో!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరించిన ఐపీఎల్ సీజన్ 10‌కు నేటితో తెరపడనుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్- పుణె సూపర్ జెయింట్స్ మధ్య తుది సమరం జరగనుంది. ఇరు జట్లపైనా భారీ అంచనాలు నెలకొనడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం కావడంతో మిగతా పనులను పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోయేందుకు సిద్ధమయ్యారు.

ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయి రికార్డు సృష్టించాలని ముంబై పట్టుదలగా ఉండగా, ఎలాగైనా ట్రోఫీ సాధించాలని పుణె భావిస్తోంది. మహారాష్ట్రకే చెందిన ఈ రెండు జట్ల మధ్య పోరు ‘మరాఠా వార్’గా మారనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. దీంతో సమ ఉజ్జీల సమరంలో విజేతగా నిలిచేదెవరన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. లీగ్‌లో పుణె చేతిలో ముంబై మూడుసార్లు ఓడినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. నాలుగోసారి ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆ జట్టులో అనుభవజ్ఞులు ఉండడమే అందుకు కారణం. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణె అసాధారణ ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హాట్ టాపిక్ అయింది.

More Telugu News