: తూర్పు చైనా సముద్రంలో అమెరికా విమానాన్ని అడ్డుకున్న చైనా యుద్ధ విమానాలు

వాతావరణంలో రేడియేషన్ ఎంతగా ఉందన్న వివరాలు తెలుసుకునేందుకు తాము తయారు చేసుకున్న విమానం తూర్పు చైనా సముద్ర పరిధిలో విహరిస్తుంటే చైనాకు చెందిన రెండు ఎస్యూ-30 (చైనీస్ సుఖోయ్) యుద్ధ విమానాలు వచ్చి అడ్డుకున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ విషయంలో చైనా వైఖరిని ఖండించిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నర్ లారీ హోడ్జ్, దౌత్య, సైనిక మార్గల్లో చైనాతో చర్చిస్తున్నట్టు తెలిపారు.

యూఎస్ విమానం డబ్ల్యూసీ-135 ఫీనిక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను వెంబడించిన చైనా సుఖోయ్ విమానాలు, దాన్ని ఆ ప్రాంతం నుంచి బలవంతంగా తరిమేసినట్టు విమాన సిబ్బంది వెల్లడించారని, తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ విమానాన్ని పంపామని తెలిపారు. కాగా, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా మిలటరీ కార్యకలాపాలు పెరిగాయని ఆరోపిస్తున్న చైనా, ఈ విమానం నిఘా నిమిత్తం వచ్చినట్టు భావించి యుద్ధ విమానాలను పంపినట్టు తెలుస్తోంది. ఈ విమానాలన్నీ ఆకాశంలో కేవలం 305 మీటర్ల దూరంలో ఫిలిప్పీన్స్, చైనీస్ మెయిన్ ల్యాండ్ ప్రాంతాల్లో తిరిగినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ ప్రకటించింది.

More Telugu News