: సన్ రైజర్స్ హైదరాబాదుకే విజయావకాశాలు...కోల్ కతాకు నిలకడలేమి: రవిశాస్త్రి

సన్ రైజర్స్‌ హైదరాబాదు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఎలిమినేటర్ మ్యాచ్ గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ, సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిలకడగా ఆడుతోందని అన్నాడు. అంతే కాకుండా ఆ జట్టు బౌలర్లలో నలుగురు ఈ టోర్నీలో పదికిపైగా వికెట్లు తీసుకున్నారని గుర్తు చేశాడు. ‌వార్నర్, ధావన్, హెన్రిక్స్, యువీ ఇలా టాపార్డర్ మొత్తం స్థిరంగా రాణిస్తోందని తెలిపాడు. అంతేకాకుండా ఆ జట్టు రిజర్వ్‌ బెంచ్ కూడా పటిష్ఠంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) విషయానికొస్తే వారి బ్యాట్స్‌ మెన్ నిలకడ లోపంతో బాధపడుతున్నారని అన్నాడు. అయితే వారి నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. టాపార్డర్ లో గంభీర్, ఊతప్పలు ఒంటిచేత్తో విజయం అందిస్తుండగా వారికి మనీష్ పాండే చక్కగా సహకరిస్తున్నాడని తెలిపాడు. ఇక కేకేఆర్ స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. సునీల్ నరైన్, బంతి,బ్యాటుతో చెలరేగిపోతున్నాడని తెలిపాడు. మ్యాచ్ జరిగే చిన్నస్వామి స్టేడియంలో 160 పరుగులకు పైగా సాధిస్తే విజయం సాధించినట్టేనని చెప్పాడు. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటుందని అభిప్రాయపడ్డాడు. 

More Telugu News