: ఇంట్లోకి దూసుకెళ్లిన రైలు.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు

పట్టాల మీద పరుగులు పెట్టాల్సిన రైలు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రీస్‌లోని రెండో అతిపెద్ద నగరమైన థెస్సాలోన్కికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగిందీ ఘటన.  ఏథెన్స్ నుంచి బయలుదేరిన రైలు థెస్సాలోన్కి పట్టణం వద్ద పట్టాలు తప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఇంటి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. రైలులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 70 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చాలామందిని రక్షించాయి. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

More Telugu News