: ప్రతీకారంతో రగిలిపోతున్న బిన్ లాడెన్ కొడుకు!:అమెరికా అధికారి

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నాడని అమెరికాలో జరిగిన 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 2011 మే2 న లాడెన్‌ ను అమెరికన్ సీల్స్ మట్టుబెట్టిన సమయంలో అతని అబోటాబాద్ స్థావరం నుంచి కొన్ని లేఖలను స్వాధీనం చేసుకుందని ఆయన తెలిపారు. వాటిని పరిశీలించగా..లాడెన్ తదనంతరం అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని ఎంచుకుంటానని హంజా బిన్ లాడెన్ తండ్రికి మాట ఇచ్చాడని, అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని ప్రమాణం చేశాడని తెలిపారు. 

దానికి తగ్గట్టే హంజా బిన్ లాడెన్ ఈమధ్య కాలంలో విడుదల చేసిన రెండు నిమిషాల టేప్ కూడా ఉందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని స్వీకరిస్తున్నానని, అమెరికన్లకు ఇక మూడిందని, ఇరాక్, అఫ్ఘనిస్థాన్ లో అమెరికా చేసిన దానికి ప్రతీకారం తప్పదని స్పష్టం చేశాడు. అమెరికాను సర్వనాశనం చేయడమే తన లక్ష్యమని పేర్కొంటూ, అందుకోసం తీవ్ర ప్రయత్నాలు కూడా ప్రారంభించాడని ఆయన చెప్పారు. ఇప్పటికే వివిధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెంచుకుంటున్నాడని ఆయన వెల్లడించారు. జీహాదీలందర్నీ ఏకం చేసి, అమెరికాపైకి దాడికి ప్రయత్నిస్తున్నాడని ఆయన తెలిపారు.

More Telugu News