: జూలై 10 నుంచి మారనున్న ఎన్ఈఎఫ్టీ నిబంధనలు... తెలుసుకోవాల్సిన అంశాలు!
ఆన్ లైన్ ద్వారా డబ్బులు బట్వాడా చేసుకోవడానికి అత్యధికులు వినియోగిస్తున్న ఎన్ఈఎఫ్టీ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) విధానంలో మరింత పారదర్శకత, వేగం పెంచడం లక్ష్యంగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు జూలై 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా, ఇప్పటివరకూ ఎన్ఈఎఫ్టీ లావాదేవీ క్లియరెన్స్ సమయం గంటగా ఉండగా, మారిన నిబంధనల మేరకు ఆ సమయం అర గంటకు తగ్గుతుంది. ఇదే సమయంలో ఉదయం 8:30 నుంచి గంటకోసారి చొప్పున 11 అదనపు సెటిల్ మెంట్ బ్యాచ్ లను ప్రవేశపెడుతున్నామని ఆర్బీఐ వెల్లడించింది.
మొత్తం 23 బ్యాచ్ లు అమలవుతాయని, ఉదయం 8 గంటలకు తొలి బ్యాచ్ క్లియరెన్స్, రాత్రి 7 గంటలకు చివరి బ్యాచ్ క్లియరెన్స్ ఉంటుందని తెలిపింది. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ఏవైనా కారణాలతో డబ్బును జమచేయలేకపోతే, రెండు గంటల్లోగా తిరిగి ఆ మొత్తాన్ని పంపిన వారి ఖాతాలో జమ చేయాలని కూడా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మరింత వేగంగా ఫండ్స్ ట్రాన్స్ ఫర్ కోసమే ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఎన్ఈఎఫ్టీ విధానంలో బట్వాడా చేయాల్సిన కనీస మొత్తం అంటూ ఏ నిబంధనా ఉండదని, బ్యాంకు శాఖల ద్వారా జరిపే లావాదేవీలతో పోలిస్తే, తక్కువ చార్జ్ తోనే ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు చేసుకోవచ్చని పేర్కొంది.