: వాట్సాప్‌లో దైవ దూష‌ణ‌.. పోలీస్ స్టేష‌న్‌పై ప్ర‌జ‌లు రాళ్ల‌ దాడి.. పాక్‌లో ఘ‌ట‌న‌

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో దైవ దూష‌ణ చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌కాశ్ కుమార్ అనే 35 ఏళ్ల వ్య‌క్తిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ‌లూచిస్థాన్‌కు చెందిన ప్ర‌కాశ్ దైవాన్ని దూషిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. ల‌స్బేలా జిల్లా పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే త‌మ దైవాన్ని దూషించిన ప్ర‌కాశ్‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుని రాళ్లు రువ్వారు.

దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించారు. ఈ సంద‌ర్భంగా 20 మంది ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ గ‌ద్దానీ సెంట్ర‌ల్ జైలులో ఉన్న‌ట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, గ‌తంలో దైవాన్ని దూషించాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో మ‌షాల్ ఖాన్ అనే యువ‌కుడిని ప్ర‌జ‌లు కొట్టి చంపారు. ఇవే ఆరోప‌ణ‌ల‌పై 1990 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 65 మంది పాక్‌లో హ‌త్య‌కు గుర‌య్యారు.

More Telugu News