: పుతిన్ కు ఫోన్ చేసిన ట్రంప్.. కిమ్ జాంగ్ పైనే ఎక్కువ చర్చ

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధినేత ట్రంప్ ఫోన్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే దిశగా వీరిద్దరూ చర్చించుకున్నారు. సిరియాలో ఇకపై దాడులు నిర్వహించరాదని... అక్కడి పోరును తాత్కాలికంగా ఆపివేయాలని ఇద్దరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, వీరిద్దరి మధ్య సిరియా కంటే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తీరుపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కిమ్ తో చర్చలకు తాను సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించి గంటలు కూడా గడవక ముందే... ట్రంప్, పుతిన్ లు ఫోన్ సంప్రదింపులు జరపడం చర్చనీయాంశం అయింది. అమెరికాకు భయపడే ప్రసక్తే లేదని... ఏ క్షణంలో అయినా అమెరికాపై అణు దాడులు చేసేందుకు తాము సిద్ధమంటూ కిమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం.

కిమ్ కు ముకుతాడు వేయాలంటే రష్యా మద్దతు ఉండాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మొండి వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టి... పుతిన్ తో ట్రంప్ చర్చలు జరిపారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు... జీ20 దేశాల సదస్సు సందర్భంగా ఇద్దరం ముఖాముఖి కూర్చొని పలు అంశాలపై చర్చలు జరుపుదామని ట్రంప్ కు పుతిన్ ఆహ్వానం పలికినట్టు సమాచారం.

More Telugu News