: సుప్రీంకోర్టు తీర్పుతో రూ.600 కోట్లు నష్టపోయిన వాహన కంపెనీలు!

భారత్ స్టేజ్-3(బీఎస్) వాహనాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వాహన కంపెనీలకు రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఓ నివేదిక పేర్కొంది. దేశంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాల విక్రయాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల ప్రభావం మొత్తం 8 లక్షల వాహనాలపై పడగా అందులో 6.71 లక్షలు ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.

గడువుకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో తమ వద్ద ఉన్న వాహనాలను వీలైనన్ని విక్రయించుకునేందుకు మార్చి 30, 31 తేదీల్లో ఆయా కంపెనీలు భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించాయి. హీరో, బజాజ్, హోండా తదితర వాహన తయారీ కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించాయి. ఇలా తగ్గింపు ధరలకు వాహనాలను విక్రయించడం వల్ల  తయారీ రంగం ఏకంగా రూ.600 కోట్ల మేర నష్టపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇక మిగిలిపోయిన వాహనాలను బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా నష్టాలను కొంతవరకైనా తగ్గించుకునే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.

More Telugu News