: ఐసీసీ సమావేశంలో బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ.. 2-8తో భారీ ఓటమి!

నూతన ఆదాయ పంపిణీ నమూనా, పరిపాలనా విధానాల్లో మార్పులకు అనుకూలంగా దుబాయ్‌లో బుధవారం నిర్వహించిన ఓటింగ్‌లో బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పదిమంది సభ్యుల ఓటింగ్‌లో 2-8 తేడాతో బీసీసీ ఓడిపోయింది. పరిపాలన విధానంపై 1-9 ఓట్లు వచ్చాయి. ఫలితంగా పరిపాలక ఓటు హక్కును కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఒక్క శ్రీలంక మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఓటేసింది. పాత రెవెన్యూ పద్ధతిని పాటించేందుకు అన్ని బోర్డుల మద్దతును బీసీసీఐ కూడగట్టినప్పటికీ ఓటింగ్ మాత్రం వ్యతిరేకంగా రావడం గమనార్హం. ఐసీసీ తీరుకు నిరసనగా డెడ్‌లైన్ దాటినా జట్టును ప్రకటించని బీసీసీఐ తాజాగా ఓటమితో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

ఐసీసీ రెవెన్యూలో ప్రస్తుతం ఉన్న ఆదాయ పంపిణీ ప్రకారం బీసీసీఐ 579 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3724 కోట్లు) అందుకుంటోంది. ఐసీసీ చైర్మన్ మనోహర్  ప్రతిపాదించిన నూతన ఆదాయ పంపిణీ నమూనా విధానం కనుక అమల్లోకి వస్తే బీసీసీఐకి కేవలం 290 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1865 కోట్లు) మాత్రమే వస్తాయి. దీంతో పాత రెవెన్యూ పద్ధతినే కొనసాగించేలా బీసీసీఐ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బుధవారం నాటి సమావేశంలో ఒక్క శ్రీలంక మినహా ఐసీసీ సభ్యులుగా ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డులు భారత్‌కు వ్యతిరేకంగా ఓటేశాయి.

More Telugu News