: శరీరాన్ని తూటాలు జల్లెడ చేస్తున్నా.. ఐదుగురు నక్సల్స్‌ను మట్టుబెట్టి.. సహచరులను కాపాడిన జవాను!

భోజనం చేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోలు దాడిచేసి 25 మందిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ఓ జవాను ప్రదర్శించిన సాహసం ఔరా అనిపిస్తోంది. అతడిని చూసి దేశం గర్విస్తోంది. అన్ని వైపుల నుంచి నక్సల్స్ తూటాలు కురిపిస్తున్నా, శరీరం జల్లెడలా మారినా ఏమాత్రం లెక్కచేయకుండా సహచరులను కాపాడేందుకు ఎదురొడ్డి నిలిచాడు. ఒక్కడే ఐదుగురు మావోలను మట్టుబెట్టాడు. ఆ వీరజవాను పేరు షేర్ మహమ్మద్. ప్రస్తుతం రాయ్‌పూర్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆయన కోలుకోవాలంటూ అతడి స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఆసిఫాబాద్ గ్రామస్థులు కనిపించిన దేవుడికల్లా మొక్కుతున్నారు.  

సీఆర్‌పీఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందిన షేర్ మహమ్మద్ నాలుగేళ్లుగా చత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి నూర్ మహమ్మద్, మామ అబ్దుల్ సలాం కూడా సైనికులుగా దేశానికి సేవలు చేశారు. దేశసేవలో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని, ఓ కుమారుడు ఆర్టీవోలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాడని, తన మనవడిని కూడా ఆర్మీలో చేర్పిస్తానని షేర్ మహమ్మద్ తల్లి ఫరీదా చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షేర్ మహమ్మద్ మాట్లాడుతూ మావోల దాడిని వివరించాడు. నక్సల్స్ ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో దాడి చేశారని పేర్కొన్నాడు. తానొక్కడినే నలుగురు నక్సల్స్ గుండెల్లో గురిపెట్టి కాల్చినట్టు తెలిపాడు.

More Telugu News