: సచిన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డ ప్రముఖులు!

కోట్లాది మంది భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న భారతరత్నం.. అంతర్జాతీయ క్రికెట్ లో మరెవరికీ సాధ్యంకాని 100 సెంచరీలు, 200 టెస్టులు ఆడిన ఘనత.. వన్డేలో డబుల్ సెంచరీ సాధ్యమేనని చూపిన తొలి వ్యక్తి... అతనే సచిన్ టెండూల్కర్! 1973, ఏప్రిల్ 24న పుట్టిన సచిన్, నేడు 44వ పుట్టిన రోజును జరుపుకుంటుండగా, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రముఖులు పోటి పడ్డారు. సచిన్ సమకాలీకుడు అనిల్ కుంబ్లే విషెస్ చెబుతూ, "హ్యాపీ బర్త్ డే సచిన్. ప్రపంచంలోని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆటగాళ్లలో ఒకడివి. ఈ కొత్త సంవత్సరం నీకు మేలు కలిగించాలని కోరుతున్నా" అనగా, విమానంలో సచిన్ నిద్రిస్తున్న ఫోటోను పోస్టు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ "ఇండియాలో కాలాన్ని నిలిపే శక్తిగల దేవుడు నిద్రిస్తున్నాడు" అని పోస్టు పెట్టాడు.

"సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని బీసీసీఐ, "అతను 100 కోట్ల హృదయాలు గెలిచాడు. ఈ పుట్టిన రోజున అతనికి 100 కోట్ల శుభాకాంక్షలు చెబుదాం" అని ముంబై ఇండియన్స్ టీమ్ ట్వీట్ చేసింది. బాక్సర్ విజేందర్ సింగ్ స్పందిస్తూ, "క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ సార్ కు హ్యాపీ బర్త్ డే" అన్నాడు. క్రికెటర్లు ఆర్పీ సింగ్, అశ్విన్ రవిచంద్రన్ సహా పలువురు క్రికెటర్లు, రాజకీయ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.

More Telugu News