: శిల్పాకా, భూమా కుటుంబానికా?... నంద్యాలపై నేడు మంత్రులతో చర్చించనున్న చంద్రబాబు!

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే, టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, మరికాసేపట్లో జరిగే పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఈ విషయాన్ని చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని తనకు కేటాయించాలని శిల్పా మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ తనకివ్వకుంటే వైకాపాలో చేరేందుకు సిద్ధమన్న సంకేతాలనూ ఆయన పంపారు. అక్కడి నుంచి కూడా అవకాశం లభించకుంటే, ఇండిపెండెంట్ గా నిలిచి సత్తా చాటుతానని చెప్పకనే చెప్పారు. మరోవైపు టికెట్ తమ కుటుంబానిదేనని మంత్రి భూమా అఖిలప్రియ మీడియా ముందు ప్రకటించారు. ఇదే సమయంలో భూమా కుటుంబానికి కాకుంటే, పోటీలో తన వర్గం వారు కూడా ఉంటారని ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న విషయమై చంద్రబాబు, పార్టీ నేతలతో చర్చించనున్నారు. 

More Telugu News