: హైదరాబాదీ ఆటోవాలా గొప్పమనసు చాటిన సింగర్ వరిజశ్రీ వేణుగోపాల్!

ప్రముఖ కర్ణాటక గాయని వరిజశ్రీ వేణుగోపాల్‌ హైదారాబాదీ ఆటోవాలా మంచి మనసును తన ఫేస్ బుక్ పేజ్ లో వివరించింది. వరిజశ్రీ వేణుగోపాల్ వీసా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌ వచ్చింది. అయితే వీసా ఇంటర్వ్యూ కోసం ఆమెకు 5000 రూపాయలు అవసరం అయ్యాయి. ఆ సమయానికి ఆమె దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ఎటీఎం సెంటర్లన్నీ వెతికేసింది. సుమారు 10 నుంచి 15 ఏటీఎంలలో ఆమె డబ్బుల కోసం ప్రయత్నించింది. అయినా ఎక్కడా నగదు లభించలేదు. ఇక ఏటీఎంలలో వెతకడం వల్ల ఫలితం లేదని భావించి, స్వైపింగ్‌ మెషీన్లు ఉన్న పలు షాపుల్లో కార్డు స్వైప్‌ చేసుకొని నగదు ఇవ్వమని పలువురిని కోరింది.

చేతిలో డబ్బులు లేవని, అకౌంట్లో డబ్బులున్నాయని ఆమె సమాధానం చెబుతున్నారు... మరోవైపు ఇంటర్వ్యూ సమయం దగ్గరపడుతోంది... ఎలాగరా దేవుడా! అనుకుంటున్న సమయంలో ఆమెను ఏటీఎంలు, షాపులకు తిప్పుతున్న ఆటో డ్రైవర్ బాబా.. ఆమె దగ్గరికి వచ్చి తన దగ్గరున్న 3000 రూపాయలను ఆమె చేతిలో పెట్టి ‘‘ మేడమ్‌ మీరు వీటిని వాడుకోండి, హోటల్‌ కు వెళ్లాక తిరిగి ఇవ్వండి. ఏం పర్వాలేదు’’ అన్నాడు. దీంతో ఎంతో టెన్షన్ లో ఉన్న వరిజశ్రీ హాయిగా ఊపిరిపీల్చుకుంది. దీంతో తన పని ముగిసిన తరువాత అతనితో సెల్పీ దిగి ‘‘ఆటోడ్రైవర్‌ పేరు బాబా, ఆయన గొప్ప మనసు నన్ను కదిలించింది. నేను బాబాకు ఎంతో రుణపడి ఉంటాను’’ అంటూ తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో పోస్టు పెట్టి సెల్ఫీని పోస్టు చేసింది. దీనికి ఆమె అభిమానులు, నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది.

More Telugu News