: టెలికం కంపెనీల ఆఫర్ల హోరు.. తడిసి ముద్దవుతున్న వినియోగదారులు!

రిలయన్స్ జియో దెబ్బతో దిగివస్తున్న టెలికం కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ ఖాతాదారులు పక్క చూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నాయి. జియో ఇటీవల తీసుకొచ్చిన ‘ధన్ ధనా ధన్’ ఆఫర్‌కు పోటీగా తాజాగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించాయి.

ఎయిర్‌టెల్ రూ.244:
భారతీ ఎయిర్‌టెల్ తాజాగా ప్రవేశపెట్టిన రూ.244 ప్లాన్‌లో భాగంగా రీచార్జ్ చేసుకుంటే 70 రోజులపాటు రోజుకు 1జీబీ డేటాతోపాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు రోజుకు 300, వారానికి 1200 ఉచిత నిమిషాల పొందవచ్చు. అవి ముగిశాక నిమిషానికి 10 పైసల చొప్పున వసూలు చేస్తారు. అయితే ఈ ఆఫర్ 4జీ వినియోగదారులకు మాత్రమే. అలాగే రూ.399 ప్యాక్‌లో భాగంగా రీచార్జ్ చేసుకున్న వారికి 70 రోజులపాటు రోజుకు 1జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా 3వేల ఉచిత నిమిషాలు లభిస్తాయి. తర్వాతి నుంచి నిమిషానికి 10 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎయిర్‌టెల్  నుంచి ఎయిర్‌టెల్‌కు రోజుకు 300, వారానికి 1200 ఫ్రీకాల్స్ లభిస్తాయి. ఇది కూడా 4జీ వినియోగదారులకే పరిమితం. ఇక రూ.345తో రీచార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2జీబీ డేటాతోపాటు రూ.399 ప్లాన్ కింద అందుబాటులో ఉన్న ఉచిత కాల్స్ వర్తిస్తాయి.  

ఐడియా రూ.297: ఈ ఆఫర్‌ కింద రీచార్జ్ చేసుకున్న వారికి రోజుకు 1జీబీ డేటాను 70 రోజులపాటు అందిస్తారు. ఐడియా పరిధిలో రోజుకు 300, వారానికి 1200 ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఫ్రీకాల్స్ ముగిశాక నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తారు. 4జీ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.447తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీ డేటాతోను 70 రోజులపాటు అందిస్తారు. అన్ని నెట్‌వర్క్‌లకు 3వేల ఉచిత నిమిషాలు లభిస్తాయి. అనంతరం నిమిషానికి 30 పైసలు చార్జ్ చేస్తారు. ఐడియా టు ఐడియాకు రోజుకు 300, వారానికి 1200 ఉచిత నిమిషాలు లభిస్తాయి.

వొడాఫోన్‌ రూ.352:
ఈ ప్లాన్ కింద 56 రోజులపాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

More Telugu News