: రాణించిన టీమిండియా బౌలర్లు...ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆసీస్ టాపార్డర్ ను వేగంగా పెవిలియన్ కు పంపి షాకిచ్చారు. పేస్, బౌన్స్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియాను ఇబ్బంది పెట్టేందుకు ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆసీస్ బరిలోకి దిగింది. టీమిండియా కూడా అలాంటి వ్యూహంతోనే కొత్త కుర్రాడు కుల్ దీప్ యాదవ్ ను రంగంలోకి దించింది. దీంతో రెండు జట్లు బౌలింగ్ అస్త్రశస్తాలతో మైదానంలో దిగాయి. ఈ క్రమంలో తొలి రోజు టీమిండియా బౌలర్లు ఆసీస్ పై పైచేయి సాధించి, మొదటి రోజే 301 పరుగుల వద్ద వారి ఆటకట్టించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆసీస్ పేస్ ను తట్టుకుంది. లియాన్ రాణించినప్పటికీ భారత బ్యాట్స్ మన్ వారికి సులువుగా తలవంచలేదు. దీంతో మూడోరోజు టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. టాప్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపి షాకిచ్చి తమ ఆధిపత్యం నిరూపించుకున్నారు. ఓపెనర్లు రెన్ షా (8), వార్నర్ (8) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరగా, స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18) కాసేపు ప్రతిఘటించారు. మ్యాక్స్ వెల్ (45) దూకుడు ప్రదర్శించాడు. షాన్ మార్ష్ (1) వస్తూనే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు క్రీజులో కుమ్మిన్స్ (2), మాథ్యూ వేడ్ (6) నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా బౌలర్ల దూకుడు ముందు వారి ఆటలు సాగడం లేదు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా, వారికి భువనేశ్వర్, జడేజా చెరొక వికెట్ తీసి సహకరించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 39 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 

More Telugu News