: మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం జగన్ ని కలిసిన మోహన్ బాబు?

ప్రముఖ నటుడు మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ని అడిగారట. వచ్చే ఎన్నికల్లో తన కూతురు పోటీ చేస్తుందని ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని డైలాగ్ కింగ్ మోహన్ బాబు పట్టుబట్టారట. జగన్ ని కలిసి తన కూతురుకి ఎమ్మెల్యే టిక్కెట్ అడిగేంత చనువు మోహన్ బాబుకు ఎక్కడిదా? అనే అనుమానం తలెత్తక మానదు. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు భార్య స్వయానా జగన్ కు సమీప బంధువు. ఆ బంధుత్వం ప్రకారం, మోహన్ బాబుకు జగన్ అల్లుడు వరుస అవుతాడు. ఇదే చనువుతో, ఈ విషయమై జగన్ ని మోహన్ బాబు అడిగారట. ఇంతకీ, ఏ నియోజకవర్గం నుంచి తన కూతురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని మోహన్ బాబు అడిగారంటే.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల నుంచి. ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ కేటాయించాలని కోరారట.

అయితే, ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండటం గమనార్హం. మంచు లక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మోహన్ బాబు పట్టుబట్టడంతో, తనకు కొద్దిగా సమయం కావాలని చెప్పి జగన్ తప్పించుకున్నారట. కాగా, చంద్రగిరి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ తో ఎంత సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ కు సన్నిహితుడు. అదేవిధంగా, మంత్రి బొజ్జలపై పోటీ చేసి ఓడిపోయిన మరో వ్యక్తి కూడా జగన్ కు సన్నిహితుడే. ఈ ముగ్గురిని పక్కన పెట్టి, రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన మంచు లక్ష్మికి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తారా? అనే విషయమై ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

More Telugu News